కరోనా నేపథ్యంలో దేశంలోని 80 కోట్ల మంది పేదలకు భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

  • వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా ప్యాకేజీ 
  • 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన నిర్మలా సీతారామన్
  • గరీబ్‌ కల్యాణ్‌ పథకం పేరుతో ఈ ఆర్థిక ప్యాకేజీ అమలు
  • ఏ ఒక్కరూ ఆకలి బాధతో ఉండే పరిస్థితి రానివ్వబోమని హామీ
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోని పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన వారిని ఆదుకునేలా ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆమె ప్రకటించారు. గరీబ్‌ కల్యాణ్‌ పథకం పేరుతో ఈ ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం అందిస్తామని తెలిపారు. పేదవారిలో ఏ ఒక్కరూ ఆకలి బాధతో ఉండే పరిస్థితి రానివ్వబోమని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోన్న ప్యాకేజీతో దేశంలోని 80 కోట్ల మంది పౌరులకు లాభం చేకూరుతుందని చెప్పారు. రానున్న మూడు నెలలకు సరిపడా బియ్యం, గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

Nirmala Sitharaman
Corona Virus

More Telugu News